గోవర్ధన్‌రెడ్డి సేవలు మరువలేనివి

ఉగ్రదాడిలో అమరుడైన గోవర్ధన్‌రెడ్డి సేవలు మరువలేనవని హైదరాబాద్‌ సీఆర్‌పీఎఫ్‌ జోన్‌ డీఐజీ ఖాజాసజ్జనోద్దిన్‌ అన్నారు. బుధవారం మండలంలోని సంగనోనిపల్లిలో అమర జవాన్‌ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన జవాన్‌ కుటుంబాలను అన్నివిధాల ఆదుకొనుటకు సీఆర్‌పీఎఫ్‌ కృషి చేస్తుందని తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం అందించినట్లు వెల్లడించారు. కుటుంబానికి 5ఏకరాల ప్రభుత్వ భూమి అందించడం కోసం కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని వెల్లడించారు. సంగనోనిపల్లి పాఠశాలలో గోవర్ధన్‌రెడ్డి జ్ఞాపకార్థం గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి అందించిన సేవలను గుర్తుచేశారు. పుణేలో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న గోవర్ధ్దన్‌రెడ్డి తమ్ముడును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని అమర జవాన్‌ తల్లిదండ్రులు డీఐజీని కోరారు. అనంతరం అమర జవాన్‌ గోవర్ధన్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ పాండు, ఎస్సై సురేష్‌గౌడ్‌, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి నాయకులు భీంరెడ్డి, హన్మిరెడ్డి, భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.